కోట శ్రీనివాస రావు మరణం.
భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, బ్యాంక్ గుమాస్తా, రజకీయవేత్త.
తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించాడు.
రాజకీయవేత్తగా, శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు.
1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తన అరంగేట్రం చేసిన ఆయన 750కి పైగా చలన చిత్రాలలో నటించాడు.
ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నాడు.
2012లో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి గానూ SIIMA అవార్డును అందుకున్నారు.
2015లో, అతను భారతీయ సినిమాకి చేసిన కృషికి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు.
కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు.
తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు.
పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే, విలన్గా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు.
మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీసు, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తికట్టించారు.
క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఇతర భాషల నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన వాళ్లే ఎక్కువ, మన నుంచి అక్కడికి వెళ్లిన వారు అరుదు.
కోట శ్రీనివాసరావు మాత్రమే ఆ అరుదైన ముద్ర వేశారు.
ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేసిన నటుడనడంలో సందేహం లేదు.
అందుకే అలీ నుంచి అమితాబ్ దాకా అందరికీ ఇష్టమైన నటుడయ్యారు.
దాదాపు 750కి పైగా చిత్రాలో నటించి మెప్పించారు.
‘ప్రతిఘటన’ విజయశాంతి, చరణ్రాజ్లతో పాటు కోట శ్రీనివాసరావు జీవితంలోనూ ప్రత్యేక సినిమాగా నిలిచిపోయింది.
‘నమస్తే తమ్మీ…’ అంటూ తెలంగాణ యాసతో మినిస్టర్ కాశయ్యగా అదరగొట్టారాయన.
సినిమాల్లో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు దోహదం చేసిందీ పాత్ర.
ఆ డైలాగ్స్ను పండించేందుకు పట్టుబట్టి మరీ ఆ యాసను నేర్చుకున్నారు.
విలన్ కాళీ(చరణ్ రాజ్)కి అండగా నిలబడే అవినీతి మంత్రిగా, కిరాతకుడిగా ఆయన నటనకు విశేష స్పందన వచ్చింది.
‘ప్రతిఘటన’ ఘనవిజయం సాధించడంలో, కోట కెరీర్ను మలుపుతిప్పడంలో మినిస్టర్ కాశయ్య పాత్ర ముఖ్య భూమిక పోషించింది.
ఆ తర్వాత ఆయన కెరీర్లో ఇలాంటి పాత్రలనేకం చేసి మెప్పించారు.
‘ప్రతిఘటన’ విడుదలైన ఏడాదిలోనే సూపర్ హిట్టయిన జంధ్యాల చిత్రం ‘అహ నా పెళ్లంట’.
రాజేంద్రప్రసాద్, రజని హీరోహీరోయిన్లుగా నటించారు.
పిసినారి లక్ష్మీపతిగా కోట నటనను ఒక్క మాటలో వర్ణించలేం. అంత అద్భుతంగా నటించారు.
నీళ్ల ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు తగ్గుతుందని బట్టలకు బదులు న్యూస్ పేపర్లు చుట్టుకోవడం, కోడిని చూరుకు వేలాడదీసి కోడికూర తింటున్నట్టు అనుభూతి చెందడం లాంటి సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి.
అందుకే అరగుండు(బ్రహ్మానందం)తో కలిసి లక్ష్మీపతి పంచిన వినోదం ఇన్నేళ్లయినా గుర్తుండిపోయింది.
ఈ సినిమా హిట్టయ్యాక తెలుగులో బిజీ నటుడు అయిపోయారు.
ఇలాంటి పిసినారి పాత్రలనే ‘ఆ నలుగురు’, ‘ఆమె’ సినిమాల్లోనూ పోషించారు.
కామెడీ విలన్గానే ఎక్కువగా గుర్తుండిపోయే కోట.. గణేశ్ సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో వణుకు పుట్టించారు.
ప్రజల రక్తం తాగే ఆరోగ్య మంత్రిగా ఆయన పలికించిన హావభావాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి.
హీరో ఇంటికొచ్చి ఇచ్చే వార్నింగ్, కిడ్నీ మాఫియాను నడిపించే పలు సన్నివేశాల్లో తానెంతటి నటుడనేది తెలిసిపోతుంది.
ఆ సినిమాలో ఆహార్యం కూడా భయంకరంగా ఉంటుంది.
గుండుతో, భయంకరమైన కళ్లతో చూస్తేనే వణుకు పుట్టేలా ఉంటుంది.
ఆ పాత్రకు నూరుశాతం న్యాయం చేసి సినిమా విజయంలో భాగమయ్యారు.
‘గదైతే నేను ఖండిస్తున్న’ అంటూ గురు నారాయణ్ పాత్రతో తెరపై చేసిన సందడి తక్కువేమీ కాదు.
జగపతిబాబు హీరోగా ఆర్జీవీ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా ‘గాయం’.
నటుడిగా జగపతిబాబుకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఈ సినిమాలో కోటశ్రీనివాసరావు గురు నారాయణ్గా అదరగొట్టారు.
తెలంగాణ యాసను ఒంట బట్టించుకుని ఆయన పలికిన సంభాషణలకు మంచి పేరొచ్చింది.
సినిమా ఆద్యంతం కోట విలక్షణమైన నటనతో కట్టిపడేస్తారు.
జర్నలిస్ట్గా రేవతి అడిగే ప్రశ్నలకు తింగరి సమాధానాలిస్తూ ఆకట్టుకుంటారు.
ఇదీ ఆయన కెరీర్లో మరిచిపోలేని పాత్రే.
‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు.. భర్తగా మారకు బ్యాచిలరు’ అనే పాటతో పెళ్లి వద్దని హితబోధ చేసే అల్లాదీన్గా ‘మనీ’ సినిమాలో ఆకట్టుకుంటారు కోట.
ఆర్జీవీ నిర్మించిన ఈ చిత్రంలో బట్లర్ ఇంగ్లీష్తో ప్రేక్షకులను మనసారా నవ్వించారు.
దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘మనీ మనీ’లోనూ ఇదే పాత్రతో వచ్చీరాని ఇంగ్లీష్తో కామెడీ పండించారు.
అందులో పురాణాల మీద, నీతి నిజాయతీల మీద చెప్పే డైలాగ్లు ఆకట్టుకుంటాయి.
కోటశ్రీనివాసరావు, బాబు మోహన్లది సూపర్ హిట్ కాంబినేషన్ అనేది తెలిసిందే.
వీళ్లు ఇద్దరూ ఉంటే చాలు సినిమా సగం సక్సెస్ అయినట్టే అనేంతగా ఈ జోడి హిట్టయింది.
ముత్యాల సుబ్బయ్య తీసిన ‘మామగారు’లో ఈ జంట చేసిన కామెడీకి పొట్టచెక్కలయ్యేలా నవ్వారు తెలుగు ప్రేక్షకులు.
ఈ చిత్రం విజయం సాధించడంలో వీళ్లిద్దరి కామెడీ కీలక భూమిక పోషించింది.
పోతురాజుగా కోట శ్రీనివాసరావు నటన సినిమాకే హైలైట్.
ఆ తర్వాత ‘ఏవండీ ఆవిడొచ్చింది’, ‘చిన రాయుడు’, ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ ఇలా దాదాపు 50 సినిమాలకు పైగా వీరిద్దరూ కనిపించి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించారు.
నాగార్జున బ్లాక్ బస్టర్ చిత్రం ‘హలోబ్రదర్’లో తాడి మట్టయ్యగా నటించి ప్రేక్షకులకు కితకితలు పెట్టించాడు.
ప్రమోషన్ కోసం పడే పాట్లు, అందుకు తన కానిస్టేబుల్తో జరిగే కామెడీ మంచి వినోదాన్ని పండించింది.
సినిమా అంతా నవ్వించిన కోట..చివరిలో మల్లికార్జున రావు పాత్ర మరణించాక కన్నీళ్లు పెట్టిస్తారు.
అలా నవ్విండంలోనైనా, ఏడిపించడంలోనైనా తనకు తానే సాటి అని నిరూపించారు.
‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనూ కోట కామెడీ కితకితలు పెట్టిస్తుంది.
వారసుడు కావాలని కోరుకునే తండ్రిగా, మనవడు వచ్చాక చేసే అల్లరి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
హీరోలకు తండ్రిగానే కాకుండా తాతగానూ నటించి మెప్పించారాయన.
‘పెళ్లైన కొత్తలో’ తన మనవడి(జగపతి బాబు) దాంపత్యం బంధం బలపడేందుకు కృషి చేసే తాతగా మెప్పించారు.
ఇలాంటి తాత పాత్రలే ‘రాఖీ’, ‘బృందావనం’ లాంటి పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు.
తాతగా ఆయన చేసిన అల్లరి మంచి వినోదాన్ని పంచింది.
జీవితంలో ఇంకా స్థిరపడని కొడుక్కి మధ్యతరగతి తండ్రి పాత్రలో కంటతడి పెట్టించారు కోట.
‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలో వెంకటేశ్ నాన్నగా చేసి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు.
‘ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేవాడు కొడుకు, చచ్చేదాక ఇలా గుండెల మీద తన్నేవాడు కొడుకు కాదు’ లాంటి డైలాగ్స్తో మనుసుల్ని తడి చేస్తారు.
పైకి గంభీరంగా కనిపిస్తూనే లోపల ప్రేమను నింపుకొన్న నాన్నగా ఆ పాత్రకు ప్రాణం పోశారాయన.
టాలీవుడ్ వెండితెర నాన్న పాత్రల్లో వాస్తవానికి దగ్గరగా ఉండి మనసును మెలిపెట్టిన పాత్రల్లో ఇదొకటి.
ఇలాంటి పాత్రే ‘బొమ్మరిల్లు’ సినిమాలోనూ పోషించారు. అందులో జెనీలియాకు నాన్నగా చేశారు.
‘గబ్బర్ సింగ్’లో శ్రుతిహాసన్ తండ్రిగా నటించారు. ఆ పాత్ర కోసం గాయకుడిగానూ మారారు.
‘మందు బాబులం’ పాట మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఇందులో తాగుబోతు తండ్రిగా కోట నటనకు మచ్చ పెట్టలేం. తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లాగే దీన్ని పండించారు.
ఆయన గొంతు సవరించి పాడిన ఆ పాటతో పాటే భాగ్యలక్ష్మీ(శృతిహాసన్) తండ్రి క్యారెక్టర్ కూడా హిట్ అయింది.
తెలుగులో దాదాపు 750 చిత్రాలకు పైగా వరకు నటించి తెలుగు నాట చెరిగిపోని ముద్ర వేశారు కోట.
ఇతర భాషల్లోనూ నటించి అక్కడా తన ప్రతిభను చాటుకున్నారు. తమిళం, కన్నడం, హిందీ, మలయాళం సినిమాల్లో నటించారాయన.
‘సర్కార్’ సినిమాలో సెల్వర్ మణిగా నటించి అమితాబ్ ప్రశంసలు అందుకున్నారు.
‘డార్లింగ్’, ‘రక్త చరిత్ర’, ‘భాఘీ’ లాంటి పలు బాలీవుడ్ సినిమాలతో అక్కడా ఆకట్టుకున్నారు.
‘సామి’ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అక్కడ దాదాపు సుమారు 30 చిత్రాల్లో చేశారు.
‘తిరుపాచి’, ‘పరమశివన్’, ‘కో’, ‘అరణ్మని’ లాంటి చిత్రాల్లో చేసిన పాత్రలతో అక్కడా మంచి గుర్తింపు వచ్చింది.
మలయాళంలో ‘ది ట్రైన్’, కన్నడంలో ‘రక్త కన్నీరు’, ‘లవ్’, ‘నమ్మ బసవ’లో చేశారు.