1920-07-15 – On This Day  

This Day in History: 1920-07-15

1920 : స్వాతంత్ర్యసమరయోధుడు, మొదటి లోకసభ సభ్యుడు కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ జననం

కందాళ సుబ్రహ్మణ్య తిలక్,‌ (1920 జులై 15 – 2018, జూన్ 8) ప్రముఖ స్వాతంత్య్రసమరయోధులు. ఇతను స్వాతంత్య్ర కోసం తనదైన శైలిలో పోరాడుతున్న గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. క్షణం కూడా ఆలోచించకుండా అతను బాటన నడిచేందుకు ఉద్యుక్తుడయ్యాడు.స్వాతంత్య్రోద్యమంలో విజయనగరం జిల్లా నుంచి కీలక పాత్రధారయ్యారు.

కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌ విశాఖపట్నం జిల్లాలో జూలై 15 1920 న విశాఖపట్నంలో అల్లిపురంలో శేషశాయి, రాజరాజేశ్వరి దంపతులకు జన్మించారు. తిలక్ గర్భంలో ఉండగా రాజేశ్వరిగారికి కడుపుపై నాగుపాము కాటువేసినట్లు కల వచ్చింది. అందుకనే ఆయన పేరులో సుబ్రహ్మణ్యమనియూ, శేషశాయికి బాలగంగాధర్ తిలక్‌పై మక్కువతో తిలక్‌అనియు కలిపి సుబ్రహ్మణ్య తిలక్ అని పేరు పెట్టారు. దురదృష్టవశాత్తు పుట్తిన 5 రోజులకే మాతృవియోగం కలిగినందతనికి. తిలక్ గారి ప్రాధమిక విద్య విజయనగరం దాసన్నపేట పూసపాటి ఆనందగజపతి మెమోరియల్ మునిసిపల్ హైస్కూల్లో జరిగింది. విజయనగరం మహారాజా కాలేజీలో ఇంటర్మీడియట్ (ఎఫ్.ఎ) పూర్తిచేసారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో బి.ఎస్సీ అభ్యసించారు. అక్కడ తిలక్ గారు విద్యార్ధి సంఘానికి నాయకత్వం వహించారు. 1943 నుండి 1945 వరకు కర్ణాటక్లోని బెల్గాంలో గల లక్ష్మాగౌడా న్యాయకళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. తిలక్ 1941 ఫిబ్రవరి 7వ తేదీన మంథా సర్వేశ్వర శాస్త్రి, పేరిందేవి దంపతుల కుమార్తె సూర్యకాంతంగారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలు. అరుణా అసఫ్ ఆలీని స్ఫూర్తిగా తీసుకొని పెద్ద కుమార్తెకు ఆమెకు అరుణ అని, రెండవ సంతానం అశోక్ మెహతాను ఆదర్సంగా తీసుకొని కొడుకుకు అశోక్ అని, మూడవ కుమార్తెకు తన అమల అని పేరుపెట్టారు. ఈయన శ్రీరామసామ్రాజ్య పట్టాభిషేకం చేయించినప్పుడు ఏడుగురు తాతగార్లు ఉపనయనం చేసిన సందర్భంలో వేసిన యజ్ఞోపవేతాన్ని జాతీయ ఉద్యమంలో అడుగుపెట్టినప్పుడు త్యజించారు. అన్నింటా ఆదర్శవంతంగా నిలచిన సూర్యాకాంతంగారు కూడా 1949లో తనకు వివాహసమయంలో భర్త కట్టిన మంగళసూత్రాన్ని త్యజించారు. జాతీయోద్యమ సమయంలో ఈయన ఇంటికి వచ్చిన అందరినీ సమానంగా కులమతాలకు అతీతంగా ఆదరించి భోజనం పెట్టేవారు.

తిలక్ గారు 1975లో విజయనగరంలో సొసైటీ ఫర్ సోషల్ ఛెంజ్ అనే సంస్థను స్థాపించారు. 1981 నుండి 1982 వరకు ఒయాసిస్ ఎడ్యుకేషనల్ సొసైటీకి సేవలందించారు. 1982 నుండి 1984 వరకు యలమంచిలిలో గల భాగవతుల ట్రస్టుకు సేవలందించారు.తమ కుమారుడికి కులాంతర వివాహం చేసారు.వరకట్న వ్యవస్థను తీవ్రంగా విమర్సించారు. 1997లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆయనకు కళాప్రపూర్ణ ను ప్రదానం గావించింది. ఆయనకు 80 సం. వయస్సు వచ్చిన నేపధ్యంలో విశాఖ సముద్రతీరంలో గల విశ్రాంత అనే వృద్ధాశ్రమంలో చేరారు. 2012 మే 13వ తేదీన లోక్సభకు జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులమీదుగా తిలక్‌ను ఘనంగా సత్కరించారు.2105 మే27న ఆయనకు భార్యా వియోగం కలిగింది. 2015 లో విశాఖపట్నం లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో భాగంగా నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిలక్‌ను సత్కరించారు. ఆంధ్ర తిలకంగా పేర్గాంచిన తిలక్ గారు 2018 జూన్ 8వ తేదీన మరణించారు.ఆయన భౌతిక కాయాన్ని విశాఖపట్నం కొమ్మాదిలో గల గాయత్రి మెడికల్ కళాశాలకు అప్పగించారు. కందాళ అశోక్ వ్యవస్థాపకులుగా కె.ఎస్. తిలక్ ఫౌండెషన్ ట్రస్ట్ ను స్థాపించి ట్రస్ట్ ద్వారా పేద విద్యార్దులకు స్కాలర్‌షిప్స్ అందజేస్తున్నారు.

అప్పట్లో బ్రిటిష్‌ వారి చిత్రహింసలకు గురవుతున్న ప్రజలను చూసి అతను చలించిపోయారు.తెల్ల దొరల ఆగడాల నుంచి భారత ప్రజలను విముక్తి చేయాలనే ఆలోచన అతనికి కలిగింది. అదే సమయంలో స్వాతంత్రం కోసం పోరాడుతున్న గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, విద్యాభ్యాసం చేస్తుండగానే ఉద్యమంలోకి దిగారు.1942 ఆగస్టు 9 న చేపట్టిన పికెట్‌తో తిలక్‌ ఉద్యమంలోకి ప్రవేశించాడు. ఈ పికెట్‌లో ఉత్తరాంధ్రకు చెందిన 14 మంది పాల్గొన్నారు. వారితో కలిసి చాలా ఉద్యమాల్లో తిలక్‌ భాగస్వామి అయ్యాడు.

Share